Naralokesh padayatra,Yuvagalam
Naralokesh padayatra,Yuvagalam

వినుకొండ నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం అడుగడుగునా యువనేతకు జనం నీరాజనాలు దారిపొడవునా లోకేష్ ఎదుట వెల్లువెత్తిన వినతులు

వినుకొండ: రాష్ట్రంలో అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో హోరెత్తిస్తోంది. 175వరోజు యువనేత పాదయాత్ర వనికొండ క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా మహిళలు హారతులతో నీరాజనాలు పడుతూ యువనేతకు అపూర్వ స్వాగతం పలికారు. నియోజకవర్గ ప్రజలు పెద్దఎత్తున యువనేతకు సంఘీభావం తెలియజేస్తూ… నాలుగేళ్ల రాక్షసపాలనలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించుకున్నారు. మరో 9నెలల్లో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. ఈపూరు వైకాపానాయకులు ఇష్టారాజ్యంగా తవ్వేసిన కొండబోడు వద్ద యువనేత సెల్ఫీ దిగుతూ జనం బోడిగుండు కొట్టించేరోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బొమ్మరాజుపల్లిలో సుగాలీ సామాజికవర్గీయులతో భేటీ అయిన లోకేష్… వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. వనికుంట నుంచి ప్రారంభమైన యువనేత పాదయాత్ర ఈపూరు, కూచినపల్లి, బొమ్మరాజుపల్లి మీదుగా జయంతిరామపురం విడిది కేంద్రానికి చేరుకుంది. యువనేత లోకేష్ 175వరోజు 19.2 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2332.7 కి.మీ. మేర పూర్తయింది. ఇదిలావుండగా యువనేత లోకేష్ పాదయాత్ర ఆదివారం శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

స్టిక్కర్ వేసుకోలేదని అమ్మఒడి తీసేశారు -కాసరగడ్డ మల్లయ్య, తుమ్మలకుంట.

నా కొడుకు 4వతరగతి చదువుతున్నాడు. వాలంటీర్ వచ్చి ఇంటి గోడపై జగనన్న స్టిక్కర్ వేసుకొని, సెల్ఫీ దిగాలని అడిగితే నేను ఒప్పకోలేదు. దీంతో అమ్మఒడి తొలగించారు. మా అమ్మకు గతంలో వచ్చే వికలాంగుల పెన్షన్ ను 2020లో తొలగించారు. గతంలో మా ఇంటి కరెంటు బిల్లు రూ.150 వచ్చేది, ఇప్పుడు రూ.500 వస్తోంది. దేని గురించి అయినా గట్టిగా అడిగితే రకరకాలుగా వేధిస్తున్నారు. ఇలాంటి అరాచక ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు.

ఎరువుల ధరలు భారంగా మారాయి -శివకృష్ణ, తుమ్మలకుంట.

మూడు ఎకరాల్లో మిర్చి, పొగాకు పంటలు సాగుచేస్తే, లక్షరూపాయల నష్టం వచ్చింది. పెరిగిన ఎరువుల ధరలు భారంగా మారాయి. 2014కు ముందున్న ధరలకు ఇప్పటిధరలకు పొంతన లేదు. గతంలో డిఎపి కట్ట రూ.830 ఉంటే, ఇప్పుడు 1470 అయింది. 14:35రకం కాంప్లెక్స్ ఎరువు గతంలో 950 ఉంటే, ప్రస్తుతం 1780కి, గతంలో 800 ఉన్న 20:20 యూరియా ఇప్పుడు రూ.1300కి పెరిగింది. గతంలో 90శాతం సబ్సిడీపై డ్రిప్ అందించగా, ఇప్పుడు సబ్సిడీ తగ్గించేశారు. సన్నకారు రైతులకు బోర్లు వేయిస్తే మా ప్రాంతంలో చేదోడుగా ఉంటుంది.

లేని పొలం ఉందంటూ అమ్మఒడి తొలగించారు-కాటం వెంకటేశ్వర్లు, ముండ్రువారిపాలెం.

నాకు 3ఎకరాల పొలం ఉంది. 3,4 తరగతులు చదివే ఇద్దరు బిడ్డలు ఉన్నారు. నా భార్య పేరిట ఎటువంటి  పొలం లేకపోగా, 7ఎకరాలు ఉందని చూపించి అమ్మఒడి తొలగించారు. 1.20లక్షల విలువచేసే వరిగడ్డవామిని రాత్రివేళల్లో తగులబెట్టారు. అవసరం లేకపోయినా మా ఇంటిముందు ట్రాన్స్ ఫార్మర్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. మా అమ్మకు పెన్షన్ ఇచ్చేటప్పుడల్లా వేలిముద్రలు పడటం లేదని ఇబ్బంది పెడుతున్నారు. వరి, మొక్కజొన్న పంటలు వేస్తే నష్టం వచ్చింది, వ్యవసాయంలో నష్టం, పెరిగిన ఖర్చులతో బతుకుబండి లాగలేకపోతున్నాను.

అప్పుచేసి విదేశాలకు వెళ్తున్నాం -మాదం సాయి, వి.గణేష్, ఇర్లపాడు

మేము కష్టపడి ఇంజనీరింగ్ పూర్తిచేశాం. విదేశాల్లో ఎంఎస్ చదువుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ ప్రభుత్వంలో పెట్టిన రకరకాల కండీషన్ల కారణంగా విదేశీవిద్య పథకం మాకు లభించే అవకాశం లేదు. అప్పులు చేసి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్నాం. మా చదువు పూర్తయ్యే సరికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఎపికి సాఫ్ట్ వేర్ కంపెనీలు వస్తాయి. అప్పుడు మాకు స్థానికంగానే ఉద్యోగం చేసుకునే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాం.

గిరిజనుల అభివృద్ధికి బాటవేసింది ఎన్టీఆర్! మూడేళ్లలో వరికపూడిశెల పూర్తిచేస్తాం

వినుకొండ నియోజకవర్గంలో ఐటిడిఎ తెస్తాం తాండాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

గిరిజనులతో ముఖాముఖిలో యువనేత లోకేష్

వినుకొండ:  గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేసింది టిడిపి, స్వర్గీయ ఎన్టీఆర్ గిరిజనుల అభివృద్ధి కోసం ఐటిడిఏల ద్వారా బాటలువేశారు, చంద్రబాబునాయుడు గిరిజన తాండాల రూపురేఖలు మార్చారని యువనేత లోకేష్ పేర్కొన్నారు. బొమ్మరాజుపల్లిలో సుగాలీ/ లంబాడీ/ బంజారా సామాజికవర్గం ప్రతినిధులతో లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… గిరిజనుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తాగునీటి సమస్య కు శాశ్వతంగా పరిష్కరిస్తాం. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం. మొదటి మూడేళ్లలో వరికపుడిశెల ప్రాజెక్టు పూర్తి చేసి పల్నాడులో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం.

గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటుచేస్తాం

అధికారంలోకి వచ్చాక ఖాళీగా ఉన్న అన్ని టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేసిన చరిత్ర టిడిపిది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని జగన్ రద్దు చేసాడు. జాతీయ విద్యా విధానం పేరుతో స్కూల్స్ మూసేస్తున్నాడు,  టీచర్ల  సంఖ్య తగ్గిస్తున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తాం. మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలు తెలుసుకొని చంద్రబాబునాయుడు  భవిష్యత్తుకి గ్యారంటీ పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారు. మహాశక్తి పథకం కింద ప్రతి నెలా మహిళలకు రూ.1500 ఇస్తాం. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం.ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మందికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు ఇస్తాం. ఆర్టీసి బస్సు ల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం.

గిరిజనుల ఉపాధికి ప్రత్యేక ప్రణాళిక అమలు

అరకు కాఫీ, తేనె తదితర అటవీ ఉత్పత్తులను ఎలా అయితే ప్రమోట్ చేసి గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించామో. అలానే మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం. వినుకొండ ప్రాంతానికి ప్రత్యేక ఐటిడిఏ ఏర్పాటు చేస్తాం. 500 కంటే ఎక్కువ జనాభా ఉన్న తాండా లను పంచాయతీలు గా గుర్తిస్తానని మాట తప్పాడు. 45 ఏళ్లు నిండిన ఎస్టీ మహిళలకు పెన్షన్ ఇస్తానని మాట తప్పాడు.

16సంక్షేమ పథకాలను రద్దుచేశాడు!

జగన్ అధికారంలోకి వచ్చాక 16 గిరిజన సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. గత ప్రభుత్వాలు గిరిజనుల జీవనోపాధి కోసం ఇచ్చిన వ్యవసాయ భూముల్ని ప్రభుత్వం వెనక్కి లాక్కుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రద్దు చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తాం. వినుకొండ కి పరిశ్రమలు తీసుకొచ్చి గిరిజనులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం. బంజారా భవనాలు నిర్మిస్తాం. సేవా లాల్ మహారాజ్ జయంతి కార్యక్రమం అధికారికంగా జరుపుతాం. తాండాల్లో నివసించే వారికి మెరుగైన వైద్య సహాయం అందించే విధంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. అవసరమైన మేర మందులు, డాక్టర్లను ఏర్పాటు చేస్తాం.

రీఎంబర్స్ మెంట్ పథకాన్ని బ్రష్టు పట్టించాడు!

 విద్యా దీవెన, వసతి దీవెన చెత్త పథకాలు. ఈ కార్యక్రమాల వలన తల్లిదండ్రులు ఒత్తిడికి లోనవుతున్నారు. 2 లక్షల మందికి మార్క్ లిస్ట్, సర్టిఫికేట్లు రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వన్ టైం సెటిల్మెంట్ చేసి సర్టిఫికేట్లు ఇప్పిస్తాం. పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ ని చంపేశాడు.  టిడిపి హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కేజీ నుండి పీజీ వరకూ పాఠ్యాంశాలు ప్రక్షాళన చేస్తాం. కాలేజ్ నుండి బయటకు వచ్చే సమయానికి జాబ్ రెడీ యూత్ ని సిద్దం చేస్తాం.

తాండాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మిగిలిపోయిన తాండా లను పంచాయతీలు గుర్తించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సిసి రోడ్లు, త్రాగునీరు, మరుగుదొడ్లు, ఇళ్లు నిర్మిస్తాం. 500 జనాభా ఉన్న తాండా లను పంచాయతీలుగా గుర్తించింది టిడిపి. మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి/ లంబాడీ/ బంజారా సామాజికవర్గం సంక్షేమం, అభివృద్ది కోసం కృషి చేస్తాం. రూ.200 పెన్షన్ ని రూ.2000 వేలు చేసిన ఘనత చంద్రబాబు గారిది. రూ.750 పెంచడానికి కి నాలుగేళ్ల మూడు నెలలు పట్టింది. సంక్షేమం, అభివృద్దికి పుట్టినిల్లు టిడిపి. చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది. టిడిపిని గెలిపించండి అభివృద్ది, సంక్షేమం మరింత ఎక్కువగా చేసే బాధ్యత నాది.

ఇంఛార్జ్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ

టిడిపి హయాంలో గిరిజన తాండాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించాం. లోకేష్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గిరిజన తాండాల అభివృద్ది కి ప్రత్యేకంగా నిధులు కేటాయించారని అన్నారు.

మా భూములు లాగేసుకుంటున్నారు-యువనేత ఎదుట గిరిజనుల ఆవేదన

సాగు, తాగునీరు కోసం ఇబ్బంది పడుతున్నాం.  మా ప్రాంతంలో 36 తాండాలు ఉన్నాయి కానీ మా పిల్లలు చదువుకోవడానికి స్కూల్ , హాస్టల్, టీచర్లు లేరు. ప్రైవేట్ స్కూల్స్ లో చదివించే స్థోమత మాకు లేదు. ఉపాధి అవకాశాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి బతకడం కష్టంగా మారింది. గిరిజనులు జీవనం కోసం భూములు ఇవ్వకపోగా మాకు జీవనాధారంగా ఉన్న భూములు లాక్కుంటున్నాడు. సేవాలాల్ మహారాజ్ జయంతి ని అధికారికంగా జరపాలి. పరిశ్రమలు తీసుకొచ్చి చదువుకున్న గిరిజన యువత కు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. బంజారా భవనాల ఏర్పాటుకి సాయం అందించాలి. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తాండా లకు దగ్గర గా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు కాక గిరిజన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ను జగన్ ప్రభుత్వం పూర్తిగా ఆపేసింది. జగన్ పరిపాలనలో తాండా లకు తాగునీరు లేదు. నివాసం ఉండటానికి ఇళ్లు లేవు, మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్నాం.

మహిళా కూలీల కష్టాలు తెలుసుకున్న లోకేష్

వినుకొండ నియోజకవర్గం జయంతిరామపురంలో  పొలంలో పనిచేస్తున్న మహిళా కూలీల వద్దకు వెళ్లిన యువనేత లోకేష్ వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. యువనేత ఎదుట కూలీలు తమ కష్టాలు చెబుతూ…రోజువారి కూలీ పనులు చేసుకుంటూనే కుటుంబాలను నెట్టుకొస్తున్నాం. రోజంతా పనిచేస్తే రూ.200 కూలీ వస్తోంది. దాంతోనే బతుకుబండి లాగుతున్నాం. నిత్యావసరాలు, గ్యాస్, కరెంటు విపరీతంగా పెరిగాయి, ఇంటిల్లపాది పనిచేసిన రెండుపూటల కడుపునిండా భోజనం చేసే పరిస్థితి లేదు. పూట గడవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.

యువనేత లోకేష్ మాట్లాడుతూ

మీవంటి వారి కష్టాలు చూశాకే చంద్రబాబునాయుడు మహాశక్తి పథకాన్ని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక ప్రతి పేదకుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలండర్లు ఉచితంగా ఇస్తాం. తల్లికి వందనం కార్యక్రమంలో ఇంటిలో చదువుకునే ప్రతిబిడ్డకు రూ.15వేలు అందిస్తాం. ఆడబిడ్డ నిధి కింద 18ఏళ్ల నుంచి 60సంవత్సరాల లోపు మహిళలకు నెలకు 1500 ఇస్తాం. ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. కొద్దిరోజులు ఓపికపట్టండి… మీకోసం పనిచేసే చంద్రన్న ముఖ్యమంత్రిగా వస్తారు.

నారా లోకేష్ ను కలిసిన వనికుంట గ్రామస్తులు

వినుకొండ నియోజకవర్గం వనికుంట గ్రామస్తులు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఫ్లోరిన్ సమస్య వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం. నాలుగేళ్లుగా మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధీ జరగడం లేదు.  ఎస్సీ, ఎస్టీ, బీసీలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. అప్పులతో పిల్లల్ని చదివించుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.  మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలు పరిష్కరించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

జల్ జీవన్ మిషన్ అమలులో ఎపి 18వ స్థానంలో ఉండటమే ఇందుకు నిదర్శనం. TDP ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. పంచాయితీల నిధులను పక్కదారి పట్టించడంతో పంచాయితీల పరిస్థితి దుర్భరంగా మారింది. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో అప్పుల్లో ఎపి రైతులు మొదటిస్థానంలో నిలచారు. టిడిపి అధికారంలోకి రాగానే గ్రామసీమలకు అదనపు నిధులు ఇచ్చి గత వైభవం కల్పిస్తాం. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి, అన్నదాతలకు అండగా నిలుస్తాం.

 నారా లోకేష్ ను కలిసిన కూచినపల్లి గ్రామస్తులు

వినుకొండ నియోజకవర్గం కూచినపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామం ఎగువనుండి ఎన్.ఎస్.పీ కాల్వ నుండి వెళుతోంది. గ్రామం నుంచి కాల్వ అవతల ఉన్న పొలాలకు వెళ్లేందుకు బ్రిడ్జి లేక ఇబ్బందులు పడుతున్నాము. కాల్వ దాటాలంటే 3 కి.మీ దూరంలో ఉన్న బ్రిడ్జి దాటుకుని వెళ్లాల్సి వస్తోంది.  దీంతో ఒకసారి పొలంలోకి వెళ్లి రావాలంటే 6 కి.మీ అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. మా పొలాలకు వెల్లేందుకు ఎన్.ఎస్.పీ కాల్వపై బ్రిడ్జిని నిర్మించాలి. గ్రామంలో అర్హులైనవారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలి. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా మంచినీటిని అందించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

గ్రామీణ రైతులకు మౌలిక సదుపాయాలు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. టిడిపి అధికారంలోకి వచ్చాక కూచినపల్లిలో బ్రిడ్జి నిర్మించి రైతుల కష్టాలు తొలగిస్తాం. ఇల్లు లేని ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాం. వాటర్ గ్రిడ్ తో ఇంటింటికీ కుళాయి అందజేసి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం.

లోకేష్ ను కలిసిన బొమ్మరాజుపల్లి గ్రామస్తులు

వినుకొండ నియోజకవర్గం బొమ్మరాజుపల్లి గ్రామస్తులు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు. మా గ్రామంలో మంచినీటి సమస్య ఉంది. ఫ్లోరిన్ ఉన్న నీళ్లు తాగుతుండటంతో అనారోగ్యాలబారిన పడుతున్నాం. వాటర్ ట్యాంక్ నిర్మించి మా గ్రామస్తులు మంచినీరు అందించాలి. గ్రామంలో కమ్యూనిటీహాలు కూడా నిర్మించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

గ్రామీణ ప్రాంత ప్రజలకు గుక్కెడు నీళ్లివ్వలేని చేతగాని ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్రప్రజల దౌర్భాగ్యం. కేంద్రం నిధులిచ్చినా రాష్ట్రం వాటా చెల్లించలేక జల్ జీవన్ మిషన్ నిధులను మురగబెట్టారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి ఇంటింటికీ 24/7 స్వచ్చమైన తాగునీరు అందిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

Also Read this Blog:Walking with Purpose: A Journey Through Naralokesh’s Padayatra

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *